
ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో దేశాలన్నీ కుదేలైపోతున్న సమయంలో ద.ఆఫ్రికా వంటి తృతీయ ప్రపంచ దేశం, కొద్ది సం.ల క్రితం వరకు వలస బానిసత్వంలో మగ్గిన దేశం ఏం అభివృద్ధి సాధించిందని సాకర్ క్రీడలను వేలకోట్ల పెట్టుబడితో నిర్వహించాలనుకుంది. యూరోప్, పశ్చిమ దేశాల కుట్రలో ఇది కూరుకుపోయి ఈ భారాన్ని నెత్తికెత్తుకున్నట్లుగా అనిపిస్తోంది. తాము నిర్వహించి చేతులు కాల్చుకోకుండా ఇలా ఒక నిర్భాగ్య దేశాన్ని బలిచేసి మరో సోమాలియాగా మార్చేయడానికి పన్నాగంగా అనిపిస్తోంది.
ఇంతకు ముందు ఇండియాలో ఆసియాక్రీడలు నిర్వహించి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారు. దీని నిర్వహణ వలన వచ్చిన ఆదాయమూలేదు, కొత్తగా వచ్చేసిన పతకాలూ లేవు. ఇలాంటిదే మరల అక్కడ జరుగుతోంది. ఆ దేశం గొప్పగా చెప్పుకునే క్రీడాకారులు గానీ, వాళ్ళు సంపాదించిన అంతర్జాతీయ స్థాయి పతకాలూ లేవు. మరి ఏమాశించి ఈ క్రీడలు జరప నిర్ణయం తీసుకున్నారో. అక్కడి రాజకీయ నాయకులు, అధికారులు కోటీశ్వరులవ్వడం ఖాయం. ప్రజలు మరో దశాబ్ధం పాటు వెనకబడడం ఖాయం. ఇలా అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే ముందు తమ స్థాయిని గుర్తెరిగి నిర్వహిస్తే మంచిది. లేకపోతే భవిష్యత్ తరాలు వీళ్ళ నిర్వాకానికి అడుక్కు తినాలి.
ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అరువు క్రీడాకారులతో బాబు కూడా ఇలానే జాతీయ క్రీడలు నిర్వహించారు. దాంతో మరింత అప్పులు పెరిగాయి తప్ప మరేమీ లేదు.
ఇదంతా ప్రజలను అథఃపాతాళానికి తొక్కే రాజకీయ నాయకుల క్రీడా విన్యాసాలు తప్ప మరేమీ కాదు. ఆఫ్రికా వాసులారా బహు పరాక్.